Mukhtar Ansari: జైల్లో గుండెపోటుతో యూపీ గ్యాంగ్‌స్టర్ కన్నుమూత

  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖ్తార్ అన్సారీ మృతి చెందాడన్న వైద్యులు
  • గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అన్సారీ
  • అతడిపై 60 కేసులకు పైగా పెండింగ్, 2005లో జైలు పాలైన వైనం
  • అన్సారీని ఐదు కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టులు
Mukhtar Ansari jailed gangster turned politician dies of cardiac arrest

ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ స్టర్, మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ (60) మరణించాడు. బందా జైల్లో ఉన్న అతడికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అతడు మృతి చెందినట్టు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. అంతకుమునుపు మంగళవారం కూడా అన్సారీ అనారోగ్యం పాలయ్యాడు. కడుపులో నొప్పి వస్తోందని అతడు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రికి తరలించారు. రంజాన్ ఉపవాసం తరువాత అతడి ఆరోగ్య పరిస్థితి విషమించి అతడు మరణించినట్టు బందా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తెలిపారు. 

అయితే, అన్సారీ కుమారుడు ఉమర్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేశాడు. తన తండ్రికి జైల్లో ఆహారంలో విషం పెట్టి అంతమొందించారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టు కెళతామని అన్నాడు. తండ్రికి సంబంధించి జైలు నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, మీడియా ద్వారానే జరిగింది తెలిసిందని పేర్కొన్నాడు. 

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా ముద్రపడ్డ అన్సారీ గతంలో మావ్ సదర్ నియోజక వర్గానికి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు. 2005లో అతడు జైలు పాలయ్యాడు. అతడిపై దాదాపు 60 కేసులు పెండింగ్‌లో ఉండగా దాదాపు ఎనిమిది కేసుల్లో కోర్టులు అతడిని దోషిగా తేల్చాయి. గతేడాది ఉత్తరప్రదేశ్ ప్రకటించిన 66 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితాలోనూ అతడి పేరు చేర్చారు.

More Telugu News